
సాధారణంగా మనం బేకరీలు, హోటళ్లలో ఆలు సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు తింటూ ఉంటాం. కానీ, నాన్-వెజ్ ఇష్టపడే వారికి మటన్ కీమా సమోసా ఇచ్చే కిక్కే వేరు. పైన కరకరలాడుతూ, లోపల మసాలా దట్టించిన కీమా ముక్కలతో ఈ సమోసా ప్రతి బైట్లోనూ అద్భుతమైన రుచిని ఇస్తుంది. వర్షం పడేటప్పుడు లేదా సాయంత్రం టీ తాగే సమయంలో వేడి వేడిగా ఈ కీమా సమోసాలను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మటన్ కీమా (మెత్తగా చేసిన మాంసం) – 250 గ్రాములు
మైదా పిండి లేదా గోధుమ పిండి – 1 కప్పు
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి సరిపడా తీసుకోవాలి.
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా మీ రుచికి సరిపడా తీసుకోవాలి.
కొత్తిమీర, పుదీనా మరియు వేయించడానికి సరిపడా నూనె.
ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించాలి. అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ కీమాను వేసి బాగా కలపాలి. కీమాలోని నీరంతా పోయే వరకు ఉడికించి.. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర, పుదీనా చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్లో మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పల్చటి చపాతీల్లా చేసుకోవాలి. వాటిని మధ్యలోకి కట్ చేసి కోన్ ఆకారంలో మడతపెట్టాలి. మైదా పిండిని నీళ్లలో కలిపి జిగురులా చేసి అంచులను అంటించాలి. ఇప్పుడు ఈ కోన్ లోపల సిద్ధం చేసుకున్న కీమా మిశ్రమాన్ని నింపి, సమోసా ఆకారంలో పూర్తిగా క్లోజ్ చేయాలి.
సమోసాలను నూనెలో వేసేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసి, మంటను తగ్గించి వేయిస్తే సమోసాలు క్రిస్పీగా, బంగారు రంగులోకి వస్తాయి. కడాయిలో నూనె వేడి చేసి, సిద్ధం చేసుకున్న సమోసాలను తక్కువ మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతే.. ఎంతో రుచికరమైన, వేడి వేడి మటన్ కీమా సమోసాలు రెడీ! దీనిని వేడి టీ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వారాంతంలో మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది అంతే..!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..