
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మన వంటిళ్లలో కూడా గ్యాస్ కొరత సెగలు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్యాస్ను పొదుపు చేస్తూ, అసలు పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసుకోవచ్చు. అదే ‘పెరుగు అటుకులు’ . ఇది రుచితో పాటు మీ ఆరోగ్యానికి, ఆదాయానికి కూడా మేలు చేస్తుంది.
మొదట అటుకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. నీటిని పూర్తిగా వడకట్టి రెండు నిమిషాలు పక్కన పెడితే అటుకులు మెత్తగా తయారవుతాయి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ అటుకులను తీసుకుని, అందులో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనికి క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర జత చేయాలి. చివరగా వడ్డించే ముందు పైన కొన్ని పల్లీలు లేదా మిక్చర్ చల్లితే, తినేటప్పుడు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పులుపు ఇష్టపడేవారు అర టీస్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
పెరుగు అటుకులు కేవలం కడుపు నింపడమే కాదు, శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. సులభంగా జీర్ణమవుతుంది. అటుకులు, పెరుగు రెండూ కూడా జీర్ణవ్యవస్థపై భారం వేయవు. తిన్న తర్వాత కడుపు తేలికగా ఉంటుంది. పెరుగులో ఉండే కాల్షియం, ప్రోటీన్ వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇది పెరుగుతున్న పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది.
ఉదయం పూట ఇది తినడం వల్ల శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ స్థాయిలు అందుతాయి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో పెరుగు అటుకులు తినడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది, వడదెబ్బ నుంచి రక్షణ దొరుకుతుంది. గ్యాస్ ధరలు పెరిగినా, సిలిండర్ కొరత ఉన్నా చింతించాల్సిన పనిలేదు. పౌష్టికాహారం మన ముందే ఉంది. మరి ఈ రోజే ఈ హెల్తీ అండ్ స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ను ట్రై చేస్తారు కదూ!