
పచ్చిమిర్చితో చేసే వంటకాలు చాలా ఉన్నా, ఈ మసాలా పచ్చిమిర్చి కూర (Stuffed Green Chilli Curry) మాత్రం ప్రత్యేక రుచితో ఆకట్టుకుంటుంది. శనగపప్పు, నువ్వులు, ధనియాలు, కొబ్బరితో తయారుచేసిన ఘుమఘుమలాడే మసాలాను పచ్చిమిర్చిలో నింపి నెమ్మదిగా ఉడికిస్తే అద్భుతమైన కూర సిద్ధమవుతుంది. వేడి అన్నం, చపాతీ లేదా రోటీతో ఈ కూరను ఆస్వాదిస్తే రుచి మరింత పెరుగుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
ముందుగా పెద్ద పచ్చిమిర్చిలను కడిగి మధ్యలో పొడవుగా చీల్చి గింజలు కొంత తీసేయాలి. తర్వాత ఒక పాన్లో శనగపప్పు, ధనియాలు, నువ్వులను విడివిడిగా స్వల్పంగా వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వేయించిన ధనియాలు, శనగపప్పు, నువ్వులు కూడా ఇందులో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొద్దిగా కొబ్బరి, చింతపండు లేదా పెరుగు జోడించి గట్టిగా పేస్ట్లా రుబ్బుకోవాలి. ఈ మసాలాను చీల్చిన పచ్చిమిర్చిలలో నింపాలి.
Also Read: మ్యాథ్స్ కాదు లాజిక్ కావాలి.. ONE = 314, TWO = 325, THREE = 538 అయితే SIX = ఎంతో చెప్పండి?
ఇప్పుడు పాన్లో నూనె వేసి స్టఫ్ చేసిన మిర్చిలను అందులో అమర్చి మూతపెట్టి తక్కువ మంటపై వేయించాలి. మధ్య మధ్యలో తిప్పుతూ అన్ని వైపులా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మిగిలిన మసాలా పేస్ట్లో కొద్దిగా పాలుపోసి కలిపి మిర్చిలపై పోసి మరో 5–10 నిమిషాలు ఉడికించాలి. నూనె పైకి తేలేవరకు తేలికగా ఉడికించాలి. మసాలా మిర్చిలకు బాగా పట్టి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డించాలి.
ఈ కూరను అన్నం, రోటీ, చపాతీ లేదా జొన్న రొట్టెలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వాడిని నువ్వులు, ధనియాలు, శనగపప్పుతో చేసిన మసాలా ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.