
ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో అధిక భాగం 60 నుంచి 70 శాతం నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతుంటారు. దీంతో చాలా మంది పడుకునే ముందు కూడా నీళ్లు తాగుతుంటారు. నిజానికి ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు భంగం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో, ఎక్కువ నీరు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లబరుస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. ఇంకా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీని వల్ల నోక్టురియా అనే సమస్య వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. తగినంత నిద్ర రాకపోవడం వల్ల అలసట, తలనొప్పి, మరుసటి రోజు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.