
మనం రోజూ ఉదయం తాగే టీ కోసం వాడిన టీ పొడిని పారేయకుండా, మొక్కలకు అద్భుతమైన సేంద్రీయ ఎరువుగా (Organic Fertilizer) ఉపయోగించవచ్చని జార్ఖండ్ వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. టీ పొడిలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. టీ ఆకులలో నైట్రోజన్ (Nitrogen) శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల ఆకులు పచ్చగా, బలంగా ఎదగడానికి ప్రధాన పోషకం. దీనితో పాటు, ఇందులో లభించే పొటాషియం, ఫాస్పరస్ మొక్కల వేర్లను బలోపేతం చేస్తాయి. టీ పొడి సహజంగానే కొద్దిగా ఆమ్ల గుణాన్ని (Acidic) కలిగి ఉంటుంది. గులాబీ, మల్లె, మందార, టమోటా వంటి మొక్కలు అసిడిక్ మట్టిని ఇష్టపడతాయి. కాబట్టి, వాటికి ఇది ఇన్స్టంట్ బూస్టర్లా పనిచేస్తుంది.
టీ పొడిని నేరుగా మొక్కల కుండీలలో వేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి, ఈ క్రింది పద్ధతిని పాటించాలి:
శుభ్రంగా కడగడం: మనం టీ చేసేటప్పుడు పాలు, చక్కెర, అల్లం లేదా యాలకులు వాడుతుంటాం. ఈ చక్కెర అవశేషాలు మట్టిలో చేరితే చీమలు, ఫంగస్ (బూజు) పట్టి మొక్కలు కుళ్ళిపోతాయి. అందుకే, టీ వడకట్టిన తర్వాత మిగిలిన పొడిని మంచి నీటితో 2-3 సార్లు బాగా కడగాలి.
ఎండబెట్టడం: కడిగిన టీ పొడిని ఒక గుడ్డపై లేదా ప్లేట్లో వేసి ఎండలో పూర్తిగా ఎండిపోయేలా ఉంచాలి. తడి అస్సలు ఉండకూడదు. ఈ ఎండిన పొడిని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
మొక్కలకు వేయడం: నెలలో ఒకటి లేదా రెండుసార్లు మొక్కల మొదట్లో మట్టిని కొద్దిగా తవ్వి (గుల్ల చేసి), కుండీ పరిమాణాన్ని బట్టి 1-2 చెంచాల ఎండిన టీ పొడిని చల్లి మట్టిలో కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోయాలి.
ఈ ఎండిన టీ పొడిని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి మొక్కల మొదట్లో పోయవచ్చు. ఇది మొక్కలకు తక్షణ శక్తిని ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇకపై మీ ఇంట్లో టీ పొడిని పారేయకుండా, మీ మొక్కలను పచ్చదనంతో మురిపించేందుకు ఈ చిట్కాను తప్పక ప్రయత్నించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..