
ఆషాఢ మాసం రాగానే తెలుగు ఇళ్లలో మహిళలు, యువతులు చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం. అయితే దీని వెనుక కేవలం మంగళప్రదమైన ఆచారం మాత్రమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. అందుకే ఈ మాసంలో కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
శాస్త్రీయ కోణంలో చూస్తే.. ఆషాఢ మాసంలో తీవ్రమైన ఎండలు ముగిసి, వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ హఠాత్తు వాతావరణ మార్పుల వల్ల వాతావరణంలో తేమ పెరిగి, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ సమయంలో అంటురోగాలు, చర్మ వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. గోరింటాకులో సహజసిద్ధమైన యాంటీ-సెప్టిక్, యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని చేతులు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల హానికరమైన క్రిములు శరీరంలోకి చేరకుండా రక్షణ లభిస్తుంది.
బయట వర్షాలు పడుతున్నప్పటికీ, హఠాత్తుగా మారే వాతావరణం వల్ల మన శరీరంలో అంతర్గత వేడి అలాగే ఉంటుంది. గోరింటాకుకు శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం ఉంది. అరచేతులు, అరికాళ్ళలో ఉండే నాడుల ద్వారా ఇది శరీరంలోని అధిక వేడిని లాగేసి, ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. తద్వారా కాలానుగుణంగా వచ్చే జ్వరాలు, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వర్షాకాలంలో మహిళలు ఎక్కువగా నీటిలో పనులు చేయడం వల్ల చేతి వేళ్లు, కాళ్ల వేళ్లు నాని గోరుచుట్టు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. గోరింటాకు వేళ్లకు రక్షణ కవచంలా పనిచేసి ఈ సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా, ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
పూర్వ కాలంలో రసాయన నెయిల్ పాలిష్లు, ప్లాస్టిక్ కోన్లు లేవు. చెట్టు నుండి కోసిన తాజా గోరింటాకు ఆకులను నూరి పెట్టుకునేవారు. నేటి తరం వారు కూడా మార్కెట్లో దొరికే రసాయన కోన్ల కంటే, ఇంట్లోనే సహజసిద్ధంగా రుబ్బిన గోరింటాకును వాడటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటించడం వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఉండటం విశేషం!