ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్లో ఆడేందుకు ఏ క్రికెట్ జట్టూ ఆసక్తి చూపడం లేదు.. లాస్టియర్ శ్రీలంక జట్టు సాహసం చేసి పాక్లో సిరీస్ ఆడింది.. ఇప్పుడు జింబాబ్వే జట్టు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఆడేందుకు పాకిస్తాన్లో అడుగు పెట్టింది.. అయితే జింబాబ్వే టీమ్కు హెచ్ కోచ్గా వ్యవహరిస్తున్న లాల్చంద్ రాజ్పుత్మాత్రం పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు.. లాల్చంద్ రాజ్పుత్కు మినహాయింపు ఇవ్వాలంటూ హరారేలోని భారత రాయబార కార్యలయం చేసిన విన్నపాన్ని జింబాబ్వే ప్రభుత్వం మన్నించింది. దీంతో రాజ్పుత్ జింబాబ్వే జట్టుతో కలిసి పాక్ పర్యటనకు వెళ్లలేదు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్విట్టర్లో తెలిపింది. లాల్చంద్కు హరారేలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వీసా జారీ చేసినప్పటికీ ఆయనను టూర్ నుంచి తప్పించాలని భారత్ కోరింది. లాల్చంద్ రాజ్పుత్ గైర్హాజరు కావడంతో బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండోకు హెడ్కోచ్ బాధ్యతలు అప్పగించింది బోర్డు. ఇదిలా ఉంటే భారత్ వ్యవహరించిన తీరుపట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసింది.. జట్టుతో పాటు రాజ్పుత్కు కూడా అసాధారణ భద్రతను ఏర్పాటు చేశామని, వీసా కూడా జారీ అయిన తర్వాత ఆయనను అడ్డుకోవడంలో అర్థం లేదని పీసీబీ పేర్కొంది. మంగళవారం పాకిస్తాన్కు చేరుకున్న జింబాబ్వే టీమ్ ప్రస్తుతం క్వారంటైన్లో ఉంది.. ఆ తర్వాత ఆటగాళ్లకు కోవిడ్-19 పరీక్షలను నిర్వహిస్తారు.. ఈ నెల 30న రావల్పిండిలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది.. మూడు వన్డేల తర్వాత మూడు టీ-20 మ్యాచ్లను కూడా జింబాబ్వే ఆడుతుంది..