ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి రెండు రోజులే ఉంది. దీంతో.. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు సహా, జగన్, వైఎస్సార్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఠాకూర్ సహా వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ, పోలీసు అధికారులు సహా కృష్ణా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సమావేశానికి హాజరయ్యారు. వీవీఐపీలతో పాటు పెద్ద ఎత్తున జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు జగన్.