వెలుగులోకి వస్తున్న సృష్టి ఆసుపత్రి లీలలు

|

Aug 07, 2020 | 1:06 PM

వైద్యాన్ని వ్యాపారంగా మల్చుకున్న సృష్టి ఆసుపత్రి లీలలు.. అసహజరీతిలో వెలుగుచూస్తున్నాయి. బ్రహ్మదేవుడి రాతగా చెప్పుకునే సృష్టికార్యాన్ని.. అబాసుపాలు చేసింది ఆ ఆసుపత్రి. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి.. ఆ బిడ్డను లక్షలకు అమ్ముకున్న చీకటికోణం తాజాగా బయటపడింది.

వెలుగులోకి వస్తున్న సృష్టి ఆసుపత్రి లీలలు
Follow us on

వైద్యాన్ని వ్యాపారంగా మల్చుకున్న సృష్టి ఆసుపత్రి లీలలు.. అసహజరీతిలో వెలుగుచూస్తున్నాయి. బ్రహ్మదేవుడి రాతగా చెప్పుకునే సృష్టికార్యాన్ని.. అబాసుపాలు చేసింది ఆ ఆసుపత్రి. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి.. ఆ బిడ్డను లక్షలకు అమ్ముకున్న చీకటికోణం తాజాగా బయటపడింది.

విశాఖపట్నం సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రి ఎండీ పద్మజతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. విశాఖపట్నం జిల్లా పీ భీమవరానికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ బిడ్డ గర్భంలోనే చనిపోయినట్టుగా నమ్మించి మరొకరికి 13 లక్షలకు అమ్ముకున్నట్టు గుర్తించారు. ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. అందుకోసం నర్సు నూకరత్నం, మధ్యవర్తి రామకృష్ణ ఆసుపత్రి ఎండీ చేకూరి పద్మజతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు.

ఇదిలావుంటే, ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి చెకింగ్‌ కోసం వచ్చే వెంకటలక్ష్మితో నూకరత్నంకు పరిచయం ఏర్పడింది. ఇదే అదునుగా సృష్టి ఆసుపత్రిలో ప్రసవం మంచిగా చేస్తారని, సిజేరియన్‌కు డబ్బులు కూడా తీసుకోరని నమ్మించేయత్నం చేసింది. దాన్ని నిజమేననుకున్న వెంకటక్ష్మి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సృష్టి ఆసుపత్రిలో చేరగా.. ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి చనిపోయినట్టుగా నాటకం ఆడిన వైద్యులు.. ఏకంగా 13 లక్షలకు పిల్లలు లేని మరో జంటకు ఆ బిడ్డను అమ్ముకున్నట్లు విచారణలో తేలింది.

సరోగసి ముసుగులో చిన్నారుల అక్రమ రవాణాపై ఒక్కోకోణం వెలుగుచూస్తుండడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడేళ్లలో సృష్టి ఆసుపత్రిలో 63 సరోగతి డెలివరీలు జరిగినట్టు గుర్తించిన పోలీసులు.. వాటిలో ఏమైనా తేడాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. డాక్టర్‌ నమ్రత, పద్మజ ఆ దారుణాలకు పాల్పడినట్టుగా సీపీ ఆర్కే మీనా తెలిపారు.

ఇలా ఒక్కొక్కటిగా సృష్టి లీలలు వెలుగుచూస్తుండడంతో.. ఆసుపత్రి ముసుగులో వాటి నిర్వాహకులు సాగించిన దందాలు ఒక్కొక్కటిగా విచారణలో బయటపడుతున్నాయి. సృష్టి ఆసుపత్రికి పద్మజ ఆసుపత్రికి లింకులున్నట్టు కనుగొన్న పోలీసులు.. చెకప్‌ కోసం వచ్చే వారికి మాయమాటలు చెప్పి మోసగిస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మారం చేశారు.