శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

|

Sep 18, 2020 | 10:14 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హస్త నక్షత్రంలో శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు...

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
Follow us on

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హస్త నక్షత్రంలో శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సాలు ప్రారంభమయ్యాయి.

అద్దాల మండపంలో పుట్టమన్ను సేకరించి శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలను జరుపుతున్నారు. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శనివారం ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ .. తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.