లాక్ డౌన్ కారణంగా టీటీడీ శ్రీవారి ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో బోర్డు రూ. 25కే రాయితీ లడ్డూను అందించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల్లో రాయితీ లడ్డూలను విక్రయిస్తోంది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన కూడా వస్తోంది.
ఇక ఇప్పుడు భాగ్యనగర వాసులకు కూడా శ్రీవారి లడ్డూను అందించే విధంగా ఇవాళ్టి నుంచి హైదరాబాద్లోని హిమాయత్నగర్ బాలాజీ భవన్లో లడ్డూలు విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. రూ. 25కే రాయితీ లడ్డూలను అమ్మనుండగా.. లడ్డూలు కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించడమే కాకుండా.. భౌతిక దూరాన్ని కూడా పాటించాలని టీటీడీ బోర్డు విజ్ఞప్తి చేసింది. అటు శ్రీవారి లడ్డూలను ప్రత్యేక ఆర్డర్ ద్వారా పొందాలనుకున్న వారు టీటీడీ కాల్ సెంటర్ టోల్ఫ్రీ నంబర్లు 18004254141/ 1800425333333కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కాగా, లాక్ డౌన్ సడలింపులలో భాగంగా ఏపీలో జూన్ 8 నుంచి ఆలయ దర్శనాలకు అనుమతి దొరికే అవకాశం కనిపిస్తోంది.