కరోనా కష్ట కాలంలో టిక్టాక్ వీడియోలు చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకు అనుకున్న వారిలో చాలా మంది టిక్టాక్ వీడియోలు చేసి జనం మీదికి వదులుతున్నారు. వీటిలో కొన్ని క్రియేటివిటీతో కనిపిస్తుంటే మరికొన్ని జనంలో లేనిపోని అపోహలను కలిగిస్తున్నాయి. ఇలా ఓ టిక్టాక్ వీడియోను నమ్మిన ఓ పెద్దావిడ చివరికి తన కుటుంబీకుల ఆరోగ్యానికి చేటు తెచ్చిన ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
ఉమ్మెత్తకాయ తింటే కరోనా రాదన్న వీడియోను టిక్టాక్లో చూసిన ఓ బామ్మ నిజమేనని నమ్మింది … వెంటనే పొలాల వెంట పడి తిరిగి ఉమ్మెత్త కాయను సేకరించి ఇంటికి తెచ్చింది… తీరిగ్గా కూర్చుని ఉమ్మెత్తకాయను ఒలిచి విత్తనాలు వేరు చేసింది. ఇవి తింటే కరోనా రాదట…అంటూ కొడుకు, కోడలు, మనవరాలికి తినిపించింది… తాను కూడా తినేసింది… ఇక కరోనాకు చెక్పెట్టినట్టేనని సంబరపడుతున్న సమయంలో ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి…
తనతో పాటు ఉమ్మెత్తకాయ విత్తనాలు తిన్న ఇంట్లోని మిగిలిన ముగ్గురు కూడా కళ్ళు తిరిగి పడిపోవడంతో కేకలు పెట్టింది. వెంటనే ఇరుగుపొరుగు గుమిగూడి విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. వెంటనే వీరిని చీమకుర్తి లోని ఓ ప్రవేట్ హాస్పిటల్కు తరలించారు… ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మెత్తకాయలు తిని ఆస్వస్థతకు గురైన వారు చీమకుర్తికి చెందిన సుశీల(60), తిరుపతయ్య (28), సంతమ్మ(25), నైశిని(11)గా గుర్తించారు. ఉమ్మెత్తకాయలు తింటే కరోనా రాదన్న వీడియో టిక్టాక్లో ఉంటే చూసి తిన్నానని ఈ వ్యవహారానికంతటికి కారణమైన అరవైఏళ్ళ బామ్మ సుశీల అమాయకంగా చెబుతోంది.
Read this: పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ
Read this: వలస కూలీలపై విరిగిన లాఠీ.. తాడేపల్లిలో దారుణం
Read this: కరోనా కంటే కరెంటు షాకే డేంజర్… జగన్ సర్కార్పై జనసేన విమర్శ