ఇండియాలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లండన్ లో ఆదివారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించారంటూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీ స్టాండ్ విత్ ఫార్మర్స్, జస్టిస్ ఫర్ ఫార్మర్స్, ఇండియా స్టాప్ సెల్లింగ్ ఆఫ్ యువర్ ఫార్మర్స్ అని రకరకాల నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని వీరంతా అక్కడి భారత్ ఎంబసీ వద్ద ప్రొటెస్ట్ చేశారు. వీరిలో సిక్కులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొందరు ప్రధాని మోదీ పోస్టర్ తో ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే భారత రైతుల ఆందోళన ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని, కొంతమంది వ్యతిరేక వేర్పాటువాదులు భారత రైతుల ఆందోళనను సాకుగా తీసుకుని ఈ ప్రదర్శనకు దిగారని ఇండియన్ హైకమిషన్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అసలు అనుమతి లేకుండా ఇంతమంది ఎలా నిరసనకు పూనుకొన్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.