Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్ అధిష్టానం.. ఢిల్లీకి పయనమవుతున్న సీనియర్ నేతలు..
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త చీఫ్ నియామకం కోసం పార్టీ అధిష్టానం కసరత్తును...
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త చీఫ్ నియామకం కోసం పార్టీ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయలను సేకరిస్తోంది. ఇప్పటికే కొందరిని ఢిల్లీకి పిలిపించుకుని అభిప్రాయ సేకరణ జరుపగా.. తాజాగా మరికొందరు నేతలను ఢిల్లీకి పిలిపించుకుని పీసీసీ నియామకానికి సంబంధించి సలహాలు, సూచనలను స్వీకరించింది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. మాణిక్కం ఠాగూర్ను కలిశారు. పీసీసీ చీఫ్ నియామకంపై తన అభిప్రాయాన్ని ఆయనకు వివరించారు. వీలైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక మాణిక్కం ఠాగూర్తో పాటు, మరికొందరు పార్టీ పెద్దలను కూడా జీవన్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త పీసీసీ చీఫ్ నియామక అంశంపై రేపో మాపో ఉత్తమ్తో రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్గా అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లేదంటే రేవంత్ రెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తుందనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
Also read:
అజింక్య రహానే ఆటతీరుపై సీనియర్ల ప్రశంసలు..కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించాడు అంటూ ట్వీట్
Income Tax Return : మరో నాలుగు రోజులు మాత్రమే..ఐటీ రిటర్న్స్ దాఖలుకు డిసెంబర్ 31తో ఆఖరు