కోవిద్-19 మహమ్మారి నుంచి వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు జార్ఖండ్ అధికార యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 రోగులకు ఇకపై రోబోల ద్వారా మందులు, ఆహారం అందజేయాలని సంకల్పించింది. జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న రెండు ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలుచేస్తున్నారు. జిల్లా డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ (డీడీసీ) ఆదిత్య రంజన్ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం కొబొట్-రోబోటిక్స్ను అభివృద్ధి చేసిందనీ.. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇవి మానవ ప్రమేయం లేకుండా రోగులకు మందులు, ఆహారం అందజేయగలవని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఝార్ఖండ్ లోని ఏఎన్ఎం స్కిల్ సెంటర్, చైబాసా సదర్ ఆస్పత్రితో పాటు చక్రధర్పూర్లోని కొవిడ్-19 రైల్వే ఆస్పత్రిలో 20, 30 పడకల ‘‘హైటెక్ సొల్యూషన్’’ వార్డులను ప్రారంభించనున్నట్టు డీడీసీ ఆదిత్య రంజన్ పేర్కొన్నారు. కొబోట్-రోబోటిక్స్ ద్వారా మందులు, ఆహారం అందించేలా ఈ వార్డులను రూపొందించామనీ… దేశంలో ఈ తరహా ఏర్పాట్లు ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే దేశంలో పలు చోట్ల అధికారులు రోబోల ద్వారా కరోనా రోగులకు మందులు, ఆహారం పంపడం, డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక ద్రావణాన్ని స్ప్రే చేయడం వంటి వినూత్న చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: కోవిద్ 19 ఎఫెక్ట్: న్యూయార్క్ లో.. ప్రతి 100 మందిలో.. ఒకరికి కరోనా పాజిటివ్..