అప్పుడు రాని అమిత్ షా… ఇప్పుడెలా వచ్చారు?… బీజేపీ నేతలపై ధ్వజమెత్తిన పొన్నం ప్రభాకర్

|

Nov 29, 2020 | 5:14 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.

అప్పుడు రాని అమిత్ షా... ఇప్పుడెలా వచ్చారు?... బీజేపీ నేతలపై ధ్వజమెత్తిన పొన్నం ప్రభాకర్
Follow us on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ తానొక ఎంపీ, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడనే విషయాన్ని మరిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బండి సంజయ్‌ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ మతిస్థితిమితం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కులం, మతం పేరుతో చెత్త రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీకి అభ్యర్థులు దొరక్కపోవడంతో కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ తమ పార్టీలో చేరాలని అడుక్కుంటున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి రావడంపైనా పొన్నం తీవ్రంగా స్పందించారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు జాతీయ నేతలు రావడం అవసరమా? అని ప్రశ్నించారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ప్రజలు అల్లాడినప్పుడు అమిత్ షా వంటి నేతలు ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు రాని అమిత్ షా.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ నిప్పులు చెరిగారు. మత రాజకీయాలు చేసే బీజేపీకి హైదరాబాద్ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని పొన్నం పేర్కొన్నారు.