నిధుల కోసం కేంద్రంపై పోరాటం

|

Sep 19, 2020 | 12:00 PM

కరోనాతో కుదేలైపోయిన ఆర్థిక పరిస్థితిని కుదురుకునేలా చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఒకవైపు స్థానికంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ...

నిధుల కోసం కేంద్రంపై పోరాటం
Follow us on

కరోనాతో కుదేలైపోయిన ఆర్థిక పరిస్థితిని కుదురుకునేలా చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఒకవైపు స్థానికంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే కేంద్రం నుంచి వీలైనంతగా సాయం పొందేందుకు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలు వినతులను అందజేయగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సాయం కోసం అభ్యర్థనలు మొదలు పెట్టింది.

ప్రభుత్వాల తరపున కేంద్రాన్ని కోరడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేశాయి. పార్లమెంటులో సందర్భం వచ్చినపుడల్లా అటు ఏపీ అధికార పార్టీ వైసీపీ, ఇటు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్… కేంద్రానికి మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు తరచూ వినతులను సమర్పిస్తూనే వున్నారు. తాజాగా రాజ్యసభలో ప్రసంగించిన కొత్త ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. రాష్ట్ర విభజన అప్పట్నించి ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఏపీని కరోనా తాకిడి మరింతగా దెబ్బకొట్టిందని, లోన్ల రూపంలో కాకుండా గ్రాంట్ల రూపంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని మోపిదేవి తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. అయితే.. తాజాగా జీఎస్టీ వసూళ్ళు దారుణంగా పడిపోవడంతో రాష్ట్రం ఇబ్బందుల పాలైందని ఆయన తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఒకింత ఘాటైన విమర్శలతో కేంద్రంపై విరుచుకుపడ్డారు. జీఎస్టీ లోటును కేంద్రం నేరుగా పూడ్చకుండా.. లోన్ల పరిమితిని పెంచడం.. అప్పులు తెచ్చుకుని గట్టెక్కమనడాన్ని కేకే తీవ్రంగా తప్పుపట్టారు. జీఎస్టీ బకాయిలను కేంద్రం స్వయంగా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటు టీఆర్ఎస్, అటు వైసీపీ కేంద్రంపై నిధుల కోసం యుద్ధం ప్రకటిస్తుంటే వారి ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రయత్నిస్తుండడం విశేషం.