
కరోనా వ్యాప్తి, తీసుకుంటున్న నివారణ చర్యలు తదితర అంశాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత 10 రోజుల్లో 3,500 పడకలను వివిధ హోటళ్లలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తమకు రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఉందని వివరించారు. కాగా ప్లాస్మా థెరపీ తర్వాత మరణాల శాతం దాదాపు సగం తగ్గిందని తెలిపారు.
కరోనాతో ప్రధాన సమస్య అకస్మాత్తుగా ఆక్సీజన్ శాతం పడిపోవడమే అన్న ఢిల్లీ సీఎం..ఆక్సీజన్ స్థాయి 95 శాతం ఉంటే ప్రమాదమేమి ఉండదన్నారు. 90 నుంచి 85 శాతం వరకు ఆక్సీజన్ స్థాయి పడిపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని వెల్లడించారు. ఆక్సిజన్ లెవల్స్ 85 కంటే దిగువకు పడిపోతే అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఎల్ఎన్జేపీ, రాజీవ్ గాంధీ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచబోతున్నట్లు వివరించారు కేజ్రీవాల్. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,47,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,931 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 73,780 కేసులు, 2,429 మరణాలు సంభవించాయి.