
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందాని జనమంతా ఆశ ఎదురుచూస్తున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న నిత్యం వేలాది కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరోవైపు శీతకాలం వచ్చేందుకు వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా, కరోనా కట్టడికి వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వచ్చేవారం కోవ్యాక్సిన్ మూడోదశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ టీకా ప్రయోగదశలో ఉన్నది. దేశవ్యాప్తంగా 12 ఆస్పత్రులను ఎంపిక చేసి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో నిమ్స్ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఆస్పత్రిలో ఇంతకు ముందు నిర్వహించిన రెండు ట్రయల్స్ విజయవంతమైనట్లు భారత్ బయోటెక్ ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు దశలలో టీకా తీసుకున్న 92 మంది వాలంటీర్లు ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి సైడ్ ఏఫెక్ట్స్ లేకపోవడంతో తుది దశ ట్రయల్స్ కు సిద్ధమవుతున్నారు. మూడోదశ ట్రయల్స్కు ఎథిక్స్ కమిటీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి 500 మంది నుంచి 600 మంది వాలంటీర్లను ఎంపిక చేసి టీకాలు ఇవ్వనున్నారు. 28 రోజుల తర్వాత మరోసారి వారికి బూస్టర్డోస్ ఇస్తారు. 90 రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పర్యవేక్షణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తరువాత వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.