AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కరి కోసం తెరుచుకున్న ‘మచు పిచు’

పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడం మచు పిచు.. ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన ఈ పర్యాటక ప్రాంతానికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు.

ఒక్కరి కోసం తెరుచుకున్న 'మచు పిచు'
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2020 | 1:55 PM

Share

పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడం మచు పిచు.. ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన ఈ పర్యాటక ప్రాంతానికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. కాగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో గత కొన్ని నెలలుగా ఈ ప్రదేశం మూతబడింది. అయితే తాజాగా ఈ కట్టడాన్ని కొంతసేపు తెరిచారు. అది కూడా కేవలం ఒకే ఒక్క టూరిస్ట్ కోసం. జపాన్‌కు చెందిన 26ఏళ్ల జెస్సీ కటయమా ఈ ఏడాది మార్చిలో మచు పిచు సందర్శించేందుకు పెరూ వెళ్లారు. అదే సమయంలో కోవిడ్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉండటంతో, పెరూ దేశం హెల్త్ ఎమర్జెన్సీ స్థితిని ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు చేసింది. పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలను వెంటనే మూసివేసింది. దీంతో కటయమా గత మార్చి నుంచి పెరూలోనే చిక్కుకుపోయారు.

కటయమా గురించి ఇటీవల స్థానిక పర్యాటక అధికారులకు తెలిసింది. దీంతో అతడు మచు పిచు చూసేందుకు అధికారులు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. కేవలం అతడి కోసమే ఆ కట్టడాన్ని కాసేపు తెరిచి ఉంచారు. టూరిస్టు పర్యటన పూర్తయిన తర్వాత మళ్లీ మూసేశారు. ఈ సందర్భంగా జెస్సీ కటయమా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ‘మచు పిచు చూస్తానని అనుకోలేదు. కానీ అధికారుల సాయంతో ఈ చాన్స్ దక్కింది. పెరూ ప్రభుత్వం, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని కటయమా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అక్కడ తీసుకున్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా మచుపిచును నవంబరులో తిరిగి తెరవనున్నారట. కరోనా వ్యాప్తికి ముందు ఈ కట్టడాన్ని రోజుకు 2వేల మందికి పైనే సందర్శించుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోజుకు కేవలం 675 మంది టూరిస్టులను మాత్రమే అనుమతిస్తామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ( కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య ! )