పంజాబ్ పొలాల్లో పాకిస్తానీ గ్రెనేడ్లు, డ్రోన్ ద్వారా విడిచారట.. హైఅలెర్ట్ లో సరిహద్దు ప్రాంతాలు , నిఘా కట్టుదిట్టం
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో చక్రి పోస్ట్ వద్ద ఓ పొలంలో 11 గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాక్ లోని రావల్పిండి లో గల ఆయుధ ఫాక్టరీ లో తయారైనట్టు తెలుస్తోంది.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో చక్రి పోస్ట్ వద్ద ఓ పొలంలో 11 గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాక్ లోని రావల్పిండి లో గల ఆయుధ ఫాక్టరీ లో తయారైనట్టు తెలుస్తోంది. భారత సరిహద్దులకు సుమారు కిలోమీటర్ దూరంలో వీటిని పోలీసులు గుర్తించారు. సలాచ్ అనే గ్రామ పొలంలో ప్లాస్టిక్ పాకెట్ లో ఇవి చుట్టి ఉన్నాయి. వీటిపై ఆర్ జీ ఎస్ అనే మార్క్ ఉందని, పాకిస్థాన్ లో తయారైన బాంబులపై ఈ విధమైన మార్క్ లు ఉంటాయని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఈ గ్రెనేడ్లను జారవిడిచినట్టు భావిస్తున్న డ్రోన్ పై పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాన్ని నాశనం చేయలేకపోయారు. ఇటీవలే ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ ను స్మగుల్ చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఖలిస్థాన్ సంస్థతో లింక్ ఉన్న స్మగర్లకు వీరికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.
గత 15 నెలల్లో సరిహద్దుల్లోని పాక్ ఉగ్రవాదుల కోసం ఆయుధాలు, గ్రెనేడ్ల ను ఇలా స్మగుల్ చేస్తున్నారు. తాజాగా ఈ బాంబుల స్వాధీన ఉదంతం ఎనిమిదవది. పాక్ ఐ ఎస్ ఐ ఈ విధమైన కుట్రలకు పాల్పడుతోందని, అయినా మన భద్రతా దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ సంస్థల హెచ్చరికలతో నిఘాను పోలీసులు, భద్రతా దళాలు పెంచుతున్నాయి.