భాగ్యనగరంలో ఉల్లి ధరకు మళ్లీ రెక్కలు…

|

Oct 14, 2020 | 4:00 PM

దేశమంతటా మరోసారి ఉల్లిగడ్డ కోయకుండానా కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి.

భాగ్యనగరంలో ఉల్లి ధరకు మళ్లీ రెక్కలు...
Follow us on

దేశమంతటా మరోసారి ఉల్లిగడ్డ కోయకుండానా కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. దేశమంతా మళ్లీ ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లి ధర 100 ను చేరుకుంది. మొన్నటి వరకు ఉల్లి ఎగుమతిపై కేంద్రం అంక్షలు విధించడంతో దిగివచ్చిన ఉల్లిధర.. నిషేధం ఎత్తివేయడంతో మరోసారి రెక్కలు వచ్చాయి.

ఇటు, తెలంగాణ రాష్ట్రంలో కూడా కిలో ఉల్లి ధర 40 నుంచి 50 రూపాయల వరకు ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉల్లిధరలు కట్టడి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కిలో ఉల్లి కేవలం రూ. 25 మాత్రమే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

కాగా, ఇప్పటికే కరోనా మహమ్మారితో బాధపడుతున్న జనం జేబులకు ఉల్లిధర చిల్లుపెడుతున్నాయి. ఇటు, హైదరాబాద్ మార్కెట్ లో ఉల్లిధరకు రెక్కలు వచ్చాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు కేంద్రం ఎగుమతికి అనుమతించడంతో ఉల్లి ధర పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక నుండి హైదరాబాద్ కు దిగుమతి తగ్గపోవడం కూడా ఓ కారణమంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని చాలా రైతు బజార్లలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుండి ఉల్లిపాయలు సరఫరా అవుతాయి. నగరంలోని ప్రధాన మార్కెట్లకు ఉల్లిపాయల సరఫరా గత నెల నుండి దాదాపు సగానికి తగ్గింది. మాదన్నపేట మార్కెట్లో ఉల్లిపాయ ధర ఈ నెల ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ .2,800 కు పెరిగింది. ఉల్లిపాయ రాక తగ్గిపోయి 2,835 క్వింటాళ్లకు పడిపోయింది. సెప్టెంబర్ ప్రారంభంలో ఉల్లి సరఫరా 5,139 క్వింటాళ్లుగా ఉంది. అటు బోయిన్ పల్లి మార్కెట్లో ఉల్లిపాయల రాక గత ఒక వారంలో 1,451 నుండి 893 క్వింటాళ్ళకు తగ్గింది. స్థానిక మార్కెట్లలో ఉల్లిపాయల ధర కిలోకు రూ .36 నుంచి కిలోకు రూ .40-50 కు పెరిగింది. వర్షాలు, వరదలు ఇదే స్థితిలో కొనసాగితే, ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.