దేశంలో చమురు, వంట గ్యాస్ ధరలు జెట్ స్పీడులో పైకి ఎగబాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ తరువాత ఇప్పుడు సీఎన్జీ, పీఎన్జీ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. రాజధాని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) వివరాల ప్రకారం, ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి ఢిల్లీలో లీటరు సంపీడన సహజ వాయువు (సీఎన్జీ) రూ. 42.70 నుంచి రూ. 43.40కి పెరిగింది. అంతేకాదు, లీటరు పెట్రోలియం నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) రూ. 28.41కి చేరింది. దీంతో పీఎన్జీ ధర లీటరుకు రూ. 0.91 మేర పెరిగినట్లైంది. ఇక, గజియాబాద్లో లీటరు పీఎన్జీ రూ.28.36కు లభ్యమవుతోంది. నిన్ననే వంటగ్యాస్ సిలిండర్ రూ. 25 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ధరల పెరుగుదల ఉజ్వల యోజన లబ్ధిదారులపై కూడా పడుతుండటం విశేషం. ఈ క్రమంలో ఒక్క నెలలోనే వంటగ్యాస్ ధర నాలుగుసార్లు పెరిగినట్లైంది.
గ్యాస్ సబ్సిడీకి చిల్లు : వంటగ్యాస్ ధర మరోసారి పెరిగి 871 రూపాయలకు చేరింది. ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో పడే సబ్సిడీ డబ్బులకు కోత పడింది. గత మూడు నెలల వ్యవధిలో 225 రూపాయల మేర పెరిగిన గ్యాస్ ధరతో వంటింటి బడ్జెట్ మన కళ్ల ముందే రెట్టింపు అయింది.