సీఎం జగన్ కు బాలయ్య లేఖ…థాంక్స్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు, సీఎస్, ఆరోగ్యశాఖ మంత్రికి..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖలు రాశారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బాలయ్య. అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం స్ధానిక విద్యార్థులు, రాయలసీమ విద్యార్థులకు ఉపయోగకరమని పేర్కొన్నారు.
హిందూపురం మండలం మలుగురు గ్రామంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయని లేఖలో వివరించారు. రెవిన్యూ అధికారులు మలుగురు గ్రామంలో 52 ఎకరాలు భూమిని గుర్తించారని..ఆ భూమికి దగ్గరగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్న హిందూపురం నియోజకవర్గంలోని మలుగురు గ్రామం వద్ద మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని సూచించారు. మరో లేఖలో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగితే..హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్ తో పాటు సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఫ్యాక్స్ ద్వారా లేఖలను పంపించారు.




