
ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐటీ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ శాఖ పాత్ర మరింత కీలకం కానుందని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇండస్ట్రియల్ పాలసీతో పాటుగా, ఐటీ పాలసీనీ ప్రకటించేలా సమాయత్తమవ్వాలి. సైబర్ సెక్యూరిటీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఐటీలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి పెట్టాలి. చౌకగా సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ అత్యంత అనుకూలమని తెలిపారు.
ప్రొక్యూర్మెంట్, ఇన్ఫ్రా & కమ్యునికేషన్స్ కింద ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సెర్వీసెస్ (ఏపీటీఎస్), ‘మీ-సేవ’ టెక్నికల్గా గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపైనా చర్చించారు. దీనిపై జీవో ఇచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఐటీ పరిధిలోనే ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి అధికారులకు సూచించారు. విద్య, అర్హతలు, అవకాశాలను బట్టి నేరుగా ఉపాధి వివరాలు తెలుసుకునే విధంగా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.