
కరోనా పేషెంట్లకు సత్వర వైద్య సహాయాన్ని అందించడానికి కరోనా అంబులెన్స్లను తెలంగాణ ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ‘ గిఫ్ట్ ఎ స్మైల్ ’ కింద 10 నియోజక వర్గాలకు వీటిని అందించారు. వాటికి జెండా ఊపారు. గిఫ్ట్ ఎ స్మైల్ క్యాంపెయిన్ కింద కేటీఆర్ వాటిని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు అందజేశారు.
సకాలంలో అంబులెన్స్ను తయారు చేయించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. అలాగే అంబులెన్స్లను ఇచ్చిన దాతలను కూడా కేటీఆర్, ఎర్రబెల్లి ప్రశంసించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక శ్రద్దతో కరోనా వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, వర్ధన్నపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, జనగామ తదితర నియోజక వర్గాలకు వీటిని కేటాయించారు.