కేసీఆర్ ప్రజల మనిషి.. దుబ్బాక అభివృద్ధి నాదే బాధ్యతః హరీష్ రావు
తెలంగాణలో నైజాం పాలన నుంచి గత పాలకుల వరకు భూమి శిస్తు వసూలు చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్రతి అన్నదాతకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులిచ్చి చరిత్ర తిరగరాశారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
తెలంగాణలో నైజాం పాలన నుంచి గత పాలకుల వరకు భూమి శిస్తు వసూలు చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్రతి అన్నదాతకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులిచ్చి చరిత్ర తిరగరాశారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో తొగుట మండలం ఘనపూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజా సంక్షేమానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ సదుపాయం లేదన్న హరీష్.. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిందన్నారు. విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని హరీష్ ఆరోపించారు.
గతంలో ఓట్ల కోసం నేతలు వస్తే గ్రామాల్లో మహిళలు ఖాళీ నీటి బిందెలతో అడ్డుకునేవారన్న హరీష్.. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకులకు ఓట్ల ద్వారానే బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతే అని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు.