జోజిల్లా పాస్ రోడ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్న ఎంఈఐఎల్..

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్‌లలో ఎంఈఐఎల్ ఎల్-1గా నిలిచింది. శుక్రవారం నాడు ఎన్‌హెచ్ఐడిసిఎల్ ఫైనాన్స్  బిడ్లను..

జోజిల్లా పాస్ రోడ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్న ఎంఈఐఎల్..

Updated on: Aug 21, 2020 | 5:41 PM

MEIL Company Projects: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్‌లలో ఎంఈఐఎల్ ఎల్-1గా నిలిచింది. శుక్రవారం నాడు ఎన్‌హెచ్ఐడిసిఎల్ ఫైనాన్స్  బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా నిర్మించాల్సి ఉండగా.. మొదటి విభాగంలో 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. ఇందులో రెండు టన్నెల్స్ ఉంటాయి. మొదటి టన్నెల్ 2 కి.మీ కాగా.. రెండవది 0.5 కి.మీ ఉంటుంది.

జోజిల్లా టన్నెల్‌: అత్యంత క్లిష్టతరమైన నిర్మాణం:

అలాగే రెండవ విభాగంలో జోజిల్లా టన్నెల్‌ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్‌గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్ టన్నెల్‌కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది.

ఎల్-1గా నిలిచిన ఎంఈఐఎల్:

ఇందులో జోజిల్లా టన్నెల్‌కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారిని నిర్మించేందుకు, ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. గత నెల 30వ తేదిన ఎన్‌హెచ్ఐడిసిఎల్‌కు మూడు సంస్థలు బిడ్లు సమర్పించగా ఆగష్టు 21న ఫైనాన్స్ బిడ్లు తెరిచారు.

శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతం వరకు ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెలలు ఈ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు రహదారి టన్నెల్‌ను నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది.

ఎంఈఐఎల్ ఎల్-1గా నిలిచి జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్‌ను సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపీసీ పద్ధతిలో పిలిచే ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరి భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్‌ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండ ప్రాంతంతో పాటు మంచు తుఫాన్‌లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు.

సింగిల్ ట్యూబ్ టన్నెల్‌గా పిలిచే ఈ జోజిల్ల రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్. సుబ్బయ్య తెలిపారు. ఈ రహదారిలో ప్రధానంగా శాప్ట్స్ తో పాటు పోర్టల్ స్ర్టక్చర్స్, తవ్విన మట్టిరాయి (మక్కు) డిసోపోసబుల్ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్‌ను 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం పనిని ప్రధానంగా రెండు భాగాలుగా చేయాల్సి ఉంటుంది. అలాగే మంచుతుఫాన్‌లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తామన్నారు.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..