మణిపూర్ లో ఓ పోలీసు అధికారిణి తనకు లభించిన బ్రేవరీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి అప్పగించేసింది. డ్రగ్స్ కేసులో తాను దర్యాప్తు జరిపి ఓ బీజేపీ నేతను, మరో ఆరుగురిని నిందితులుగా కోర్టులో ప్రవేశపెడితే వారిని నిర్దోషులుగా కోర్టు విడిచివేసింది. దీంతో బృందా అనే ఈ పోలీసు అధికారిణి మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంది. పైగా సీఎం ఎన్. బీరెన్ సింగ్ కి ఆమె లేఖ కూడా రాసింది. తన ఇన్వెస్టిగేషన్ పట్ల న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసిందని, పైగా వీరిని నిర్దోషులుగా వదిలివేయడం తనను బాధించిందని బృందా ఈ లేఖలో పేర్కొంది. జౌ అనే బీజేపీ నేత ఇంటి నుంచి లోగడ ఈమె ఆధ్వర్యంలోని టీమ్ భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. అయితే దీనిపై ఆ నేత, అతని సహచరులు కోర్టుకెక్కారు. బృందా టీమ్ జరిపిన దర్యాప్తు సరిగా లేదంటూ కోర్టు ఈ నిందితులను వదిలివేసింది. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వ యుధ్ధం పేరిట మణిపూర్ సర్కార్ 2018 ఆగస్టు 13 న ఓ కార్యక్రమాన్ని నిర్వహించి బృందాకు గ్యాలంటరీ అవార్డును అందజేసింది.
అయితే తాను డ్యూటీ సరిగా చేయలేదని తాను భావిస్తున్నానని, ఈ గౌరవానికి అర్హురాలిని కానని అనుకుంటున్నానని ఈమె తన లేఖలో పేర్కొంది. ఈ అవార్డును, సమర్ధుడైన మరో అధికారికి అందజేయాలని బృందా కోరింది.