పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు
Kaddu Ka Kheer: మహబూబ్నగర్లో పెళ్లి విందులో మిగిలిన కద్దు కా కీర్ పాయసం తిన్న 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందగా, బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు అప్రమత్తమై ఆహార నాణ్యతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కద్దు కా కీర్ పాయసం వికటించి పదుల సంఖ్యలో కాలనీవాసులు ఆస్పత్రి పాలయ్యారు. న్యూమోతీనగర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి పాయసం అని స్వీకరిస్తే వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు.
న్యూమోతినగర్కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. వివాహ విందులో భాగంగా అక్కడ తయారు చేసిన కద్దు కా కీర్ పాయసం మిగిలిపోయింది. అయితే మిగిలిపోయిన పాయసాన్ని శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పెళ్లి నిర్వహించిన బంధువులు కాలనీ వాసులకు పంపిణీ చేశారు. చిన్నారులు, పెద్దలతో సహా అందరికీ మిగిలిపోయిన కద్దు కా కీర్ పాయసాన్ని పంచారు. అయితే ఆ పాయసం తిన్న పదుల సంఖ్యలో కాలనీ వాసులు కాసేపటికే వాంతులు చేసుకున్నారు. వరుసగా పలుమార్లు వాంతులు చేసుకోవడంతో సుమారు 30మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి 20మంది మినహా మిగతా వారు ప్రాథమిక చికిత్స తీసుకొని వెళ్లిపోయారు. 13మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవాళ్లు అస్పత్రిలో చికిత్స పొందారు.
గురువారం తయారు చేసి… శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పంపిణి చేసిన పాయసమే ఘటనకు కారణంగా బాధితులు చెబుతున్నారు. అటు ఆస్పత్రిలో చేరిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అరోగ్యం సాధారణ స్థితికి చేరుకోగానే డిశ్చార్జ్ చేస్తామన్నారు.
ఇక ఘటన వివరాలు తెలుసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అర్ధరాత్రి తర్వాత అస్పత్రికి చేరుకొని బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఉదయం అస్పత్రికి చేరుకున్న జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు, ఇతర అధికారులు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలపడంతో కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేయాలని సూచించారు.
ఇక ఘటనతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా పెళ్లిళ్లు, ఫంక్షన్స్లో మిగిలిన ఆహారాన్ని పంపిణీ చేసే క్రమంలో వాటి నాణ్యతను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
వీడియో చూడండి..
