
కోల్కతా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి కూడా చేదు అనుభవం ఎదురైంది. సిలిగురి పోలీస్ గ్రౌండ్లో రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్కు కాంగ్రెస్ నేతలు అనుమతి కోరగా చివరి నిమిషంలో పోలీసులు నిరాకరించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్ ఆదివారం సిలిగురిలో పర్యటించనున్నారు. డార్జిలింగ్లో జరగనున్న పబ్లిక్ మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. స్థలం కొరత కారణంగా ల్యాండింగ్కు నిరాకరించినట్టు సిలిగురి పోలీస్ కమిషనర్ బీఎల్ మీనా తెలిపారు. ‘సిలిగురి పోలీస్ గ్రౌండ్లో చాలా వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. స్థలం లేకపోవడంతో రాహుల్ హెలికాప్టర్ను ఇక్కడ దించేందుకు మేం అనుమతి ఇవ్వలేం’అని మీనా వెల్లడించారు. అయితే పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏప్రిల్ 7నే పోలీస్ కమిషనర్కు లేఖ రాశాం. అందుకు అనుమతి ఇవ్వలేమని ఈ రోజు ఉదయం కమిషనరేట్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అనుమతి ఇవ్వలేమని ముందే చెప్పాల్సింది. చివరి నిమిషంలో చెప్తే ఎలా? ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది’ అని నేతలు విమర్శిస్తున్నారు. కాగా.. గతంలో యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ల ల్యాండింగ్కు కూడా బెంగాల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆదిత్యనాథ్ ఝార్ఖండ్ వరకు హెలికాప్టర్లో వచ్చి అక్కడి నుంచి కారులో పశ్చిమబెంగాల్ వెళ్లారు.