Kondapochamma sagar project: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం సాక్షాత్కరించుకుంది. కొండపోచమ్మ సిగలో కాళేశ్వర గంగమ్మ చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంపు హౌజ్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. చినజీయర్ స్వామితో కలిసి (మే29) ఈ ఉదయం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండు మోటార్లను స్విచ్చాన్ చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకోనున్నాయి. అనంతరం పరుగు పరుగున కొండపోచమ్మకు చేరుకుంటున్న గోదారమ్మకు సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి జల హారతి ఇచ్చారు. జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా కొండపోచమ్మ పుణ్యక్షేత్రంలో చండీయాగం నిర్వహించారు సీఎం కేసీఆర్ దంపతులు.
ఐదు జిల్లాల జలప్రదాయిని..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ తెలంగాణలోని ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్నది. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తిచేశారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ పూర్తి వివరాలు…
రిజర్వాయర్ సామర్థ్యం : 15 టీఎంసీలు
రిజర్వాయర్ ఏరియా: 15.8 కిలోమీటర్లు
రిజర్వాయర్ మొత్తం ఆయకట్టు : 2,85,280 ఎకరాలు
లబ్ధిపొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, యదాద్రి భువనగిరి.