India Innovation index 2021: ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణకు రెండో స్థానం.. మొదటి స్థానంలో కర్ణాటక..

|

Jul 21, 2022 | 3:15 PM

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కర్ణాటక వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక అగ్రభాగాన నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో, హర్యానా మూడో స్థానంలో అగ్రభాగాన నిలిచాయి.

India Innovation index 2021: ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణకు రెండో స్థానం.. మొదటి స్థానంలో కర్ణాటక..
India Innovation Index
Follow us on

Telangana NO -2 in India Innovation index 2021: నీతి ఆయోగ్.. భారత మూడో ఇన్నోవేషన్ ఇండెక్స్‌ గణాంకాలను గురువారం ప్రకటించింది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కర్ణాటక వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక అగ్రభాగాన నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో, హర్యానా మూడో స్థానంలో అగ్రభాగాన నిలిచాయి. అదే సమయంలో ఈ ర్యాంకింగ్‌లో ఉత్తరప్రదేశ్ 7వ స్థానంలో, బీహార్ 15వ స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021’ రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరణ సామర్థ్యాలు, పర్యావరణ వ్యవస్థను పరిశీలించి ర్యాంకులను ప్రకటిస్తుంది.

ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దేశంలోని టాప్ 10 రాష్ట్రాలు ఇవే..

1. కర్ణాటక, 2. తెలంగాణ, 3. హర్యానా, 4. మహారాష్ట్ర, 5. తమిళనాడు, 6. పంజాబ్, 7. ఉత్తరప్రదేశ్, 8. కేరళ, 9. ఆంధ్రప్రదేశ్, 10. జార్ఖండ్

ఇవి కూడా చదవండి

గ్లోబల్ ఇండెక్స్ తరహాలో..

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ మూడో ఎడిషన్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరమేశ్వరన్ అయ్యర్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సూచిక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తరహాలో అభివృద్ధి చేశారు. ఇందులో కర్ణాటక రాష్ట్రం వరుసగా మూడో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. దీని మొదటి, రెండవ ఎడిషన్‌లు వరుసగా అక్టోబర్, 2019, జనవరి, 2021లో విడుదలయ్యాయి. ఇండెక్స్ మూడవ ఎడిషన్ దేశంలో ఇన్నోవేషన్ విశ్లేషణ, పరిధిని బలోపేతం చేస్తుందని అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఈసారి 66 సూచికల ఉపయోగం..

మునుపటి ఎడిషన్లలో 36 సూచికల ఆధారంగా విశ్లేషణ జరిగింది. అయితే ఈసారి 66 సూచికలను ఉపయోగించారు. సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఈ సూచిక భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆవిష్కరణ పనితీరును అంచనా వేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి పనితీరును సమర్థవంతంగా పోల్చడం కోసం 17 ప్రధాన రాష్ట్రాలు, 10 ఈశాన్య, పర్వత రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, నగర ప్రాంతాలుగా వర్గీకరించారు.

కాగా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్‌ ప్రధాన రాష్ట్రాల్లో సూచీలో అట్టడుగున నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో, చండీగఢ్ అగ్రస్థానంలో ఉండగా, ఈశాన్య, కొండ రాష్ట్రాల విభాగంలో మణిపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సిఇఒ పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ద్వారా భారతదేశంలో ఆవిష్కరణల స్థితిని పర్యవేక్షించడానికి నీతి ఆయోగ్ నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి