జనసేన పార్టీ తరఫున రాజోలు నుంచి అసెంబ్లీకి ఎన్నికయిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ .. ఇవాళ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను తొలిసారి కలిశారు. ఈ ఉదయం విజయవాడ పడమట లంకలోని పవన్కళ్యాణ్ సొంత ఇంట్లో వీరిద్దరి మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఎన్నికల్లో పార్టీ ఫలితాలు, పార్టీని మరింతగా జనంలోకి తీసుకళ్లే అంశాలపై ఈ ఇద్దరూ చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత… జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు పవన్ కల్యాణ్. పార్టీ ఓటమిపై అభిప్రాయాలు తెల్సుకుంటున్నారు. జిల్లాల వారీగా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులు, ఇతర నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నిన్న కృష్ణా జిల్లా నాయకులతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇవాళ జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ లో ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాల పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు పవన్ కల్యాణ్. కాగా తాను జనసేనలోనే కొనసాగుతానన్న రాపాక.. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే స్వాగతిస్తానని..తప్పు చేస్తే విమర్శిస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లెందుకు కృషి చెయ్యాలని జనసేనాని..ఈ సందర్భంగా రాపాకకు సూచించారు.