
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ గత రెండు, మూడు రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలోని బొగ్గు గనుల్లో ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల వరి పొలాలు నేలకు ఒరిగాయి. వర్షాలకు తోడు ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డ్రైనేజీలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. ఇంకా రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ఖైరతాబాద్, అమీర్పేట్, లక్డికాపూల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.