Kalyana Mahotsavam : భక్తులు కొంగుబంగారంగా కొలిచే కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా జరిగింది. అపురూప గడియల్లో మళ్లికార్జునుడు బలిజ మేడలమ్మ.. గొల్ల కేతమ్మలను వివాహమాడారు. అశేష భక్తజనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ క్రతవును సిద్దగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో వేద పండితులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి హరీశ్తో పాటు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవం నిర్వహిస్తారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ నిర్వాహాకులు ఈ వేడుకను నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామికి కన్యాదానం కింద మంత్రి హరీశ్రావు రూ. 1,01,016 సమర్పించారు. అదేవిధంగా స్వామి తరుపున మేడలమ్మ, కేతలమ్మలకు మంత్రి మల్లారెడ్డి రూ. 1,01,016 సమర్పించారు. కళ్యాణోత్సవం అనంతరం మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.