
ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఎంతమాత్రం సేఫ్ కాదు. యాప్స్ అడగ్గానే మనం సమాచారం ఇచ్చేస్తాం. ఆయా సంస్థలు వినియోగదారుల సమాచారాన్ని ఎవరికి అమ్ముతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఇటువంటి ఘటనలు అనేకం చూశాం. ఎన్నో పేరు మోసిన సైట్ల నుంచి కూడా డేటా హ్యాకర్ల హార్డ్ డిస్కోల్లోకి చేరిపోయింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇందుకు మినహాయింపు కాదు. యూజర్ల డేటా విషయంలో ఇప్పటికే ఎన్నోవివాదాల్లో చిక్కుకున్న ఫేస్ బుక్… 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా భారీగా అపఖ్యాతి మూటగట్టుకుంది.
తాజాగా మరోసారి ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారం లీకైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు 26 కోట్ల మందికి పైగా ఫేస్ బుక్ వినియోగదారుల పర్సనల్ డేటా ‘డార్క్ వెబ్’ చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సోఫోస్’ వెల్లడించింది. యూజర్ ఐడీలు, యూజర్ ఫుల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, టైమ్ స్టాంప్ వివరాలు, ఏజ్, రిలేషన్ షిప్ స్టేటస్ మొదలగు వివరాలన్నీ ‘డార్క్ వెబ్’ కు అమ్మినట్లు ‘సోఫోస్’ పేర్కొంది. ఫేస్ బుక్ లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాల ఆధారంగా ఈ డేటాను దొంగలించి ఉండే అవకాశం ఉందని మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ అభిప్రాయపడింది. ఫేస్ బుక్ వినియోగదారులు వెంటనే తమ అకౌంట్స్ పాస్ వర్డ్ మార్చుకోవాలని హెచ్చరించింది. డార్క్ వెబ్ అంటే… ఎన్ క్రిప్షన్ చేయబడిన వెబ్ సైట్ డేటా. ఇలాంటి వెబ్ సైట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్లలో కనిపించవు. స్పెషల్ గా నిర్వాహకుల నుంచి ‘కీ’ లభిస్తేనే, దాని సాయంతో చూడవచ్చు.