హోం మంత్రి అమిత్ షా రెండు రోజులపాటు అస్సాంలో జరిపిన పర్యటన సత్ఫలితాలనిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అజంతా నియోగ్ . రాజ్ దీప్ గోవాలా అనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరిద్దరూ గత శనివారం అమిత్ షాతో భేటీ అయ్యారు. వచ్ఛే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇది దెబ్బే ! ఇక ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ కి చెందిన 20 మంది సభ్యులే ఉన్నారు. విపక్ష హోదా దక్కాలంటే కనీసం 21 మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది. అస్సాం బీజేపీ అధ్యక్షుడు రంజిత్ దాస్, మరో బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సమక్షంలో..అజంతా నియోగ్ , రాజ్ దీప్ బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని రాజ్ దీప్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీలో నాయకత్వానికి, కింది స్థాయి కార్యకర్తలకు మధ్య పెద్ద ‘గ్యాప్’ ఉందని, ఆ పార్టీలో క్రమశిక్షణ లేదని ఆయన అన్నారు. దానికి ఓ డైరెక్షన్ అంటూ లేదన్నారు. కాగా వీరిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై అజంతాను కాంగ్రెస్ బహిష్కరించగా ..రాజ్ దీప్ పై ఆరేళ్ళ పాటు బహిష్కరణ వేటు పడింది.