ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాధి.. 591కి చేరుకున్న బాధితుల సంఖ్య.. అంతు తేల్చే పనిలో జాతీయ పరిశోధన సంస్థలు

|

Dec 10, 2020 | 7:13 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి మరో 24 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 591కి చేరింది.

ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాధి.. 591కి చేరుకున్న బాధితుల సంఖ్య..  అంతు తేల్చే పనిలో జాతీయ పరిశోధన సంస్థలు
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి మరో 24 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 591కి చేరింది. ఇప్పటివరకు 511 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 46 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ వ్యాధికి గురైనవారిలో పన్నెండేళ్ల లోపు చిన్నారులు 75 మంది కాగా, ఇందులో బాలురు 43, బాలికలు 32 మంది ఉన్నారు. ఇక 12 – 35 వయసు కలిగిన వారిలో 326 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 167 మంది ఉంటే, మహిళలు – 159 మంది ఉన్నారు. కాగా, 35 ఏళ్లకు పైబడినవారిలో 190 మంది వింత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పురుషులు 106 మంది కాగా, మహిళలు 84 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు అంతుచిక్కని ఈ వ్యాధికి కారణాలు తెలుసుకునేందుకు జాతీయ పరిశోధన సంస్థలు నమూనాల సేకరణ కొనసాగిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో, ఎన్ఐఎన్‌, ఐసీఎంఆర్‌, ఐపీఎం బృందాలు పరిశోధనలు జరుపుతున్నారు. రోగుల రక్త నమూనాలతోపాటు నీరు, ఆహార పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపించామని.. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నివేదికలు వచ్చాక స్పష్టమైన ప్రకటన చేస్తామని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.