హైదరాబాద్ మణిహారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రారంభోత్సవ వివరాలను అధికారులు తెలియజేయనున్నారు. ముందుగా ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. అయితే వాయిదాకు గల కారణాలను వెల్లడించలేదు. ప్రస్తుతం హైదరాబాద్లో కురుస్తున్న అధిక వర్షాల వల్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా… ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. రెండేళ్ళలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే.
184 కోట్ల వ్యయంతో నిర్మించిన 754.38 మీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జి త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి నిర్మానంతో మాదాపూర్ – జూబ్లీహిల్స్ల మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. కేబుల్ బ్రిడ్జితో దుర్గం చెరువు పర్యాటక ప్రాంతంగానూ మారనుంది.
ఇకపోతే, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలు అందరిని కనువిందు చేస్తున్నాయి. రాత్రి సమయంలో విద్యుత్ వెలుగుల మధ్య ఈ కేబుల్ బ్రిడ్జి జిగేల్ మంటోంది. ఆ బ్రిడ్జిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నగర ప్రజలను మరింతగా ఆకర్షిస్తోంది. రంగురంగుల విద్యుత్ వెలుగుల మధ్య మెరిసిపోతున్న బ్రిడ్జిని డ్రోన్ల సాయంతో వీడియో తీశారు.