ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా.. హైదరాబాద్ మూలాలపై నిఘా వర్గాల ఆరా..!

|

Jan 09, 2021 | 9:16 PM

ఇండోర్‌లో కలకలం రేపిన డ్రగ్‌ రాకెట్‌ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన అధికారులకు అసలు వ్యవహరం బయటపడింది.

ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా.. హైదరాబాద్ మూలాలపై నిఘా వర్గాల ఆరా..!
Follow us on

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న ముఠాను అధికారులు గుర్తించారు. అయితే, ఈ డ్రగ్స్ ముఠా హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో రా మెటిరీయల్స్‌ను తయారు చేసి ఆ తర్వాత హైదరాబాద్ ద్వారా ఇండోర్‌కి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్‌లో కలకలం రేపిన డ్రగ్‌ రాకెట్‌ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన అధికారులకు అసలు వ్యవహరం బయటపడింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల తయారీ స్థావరం ఎక్కడన్నదీ పోలీసుల కూపీ లాగే పనిలో పడ్డారు.

ఇటీవల హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ జలవాయు విహార్‌కు చెందిన వేద్‌ప్రకాశ్‌ వ్యాస్‌ 70 కిలోల ఎండీఎంఏ మాదకద్రవ్యాల్ని తయారు చేసినట్లు ఇండోర్‌ పోలీసులు గుర్తించారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబరాబాద్‌ దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌లో వ్యాస్‌కు చెందిన అరిస్టాన్‌ ఫార్మా నోవాటెక్‌ కంపెనీలో ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఆనవాళ్లను గుర్తించలేకపోయార. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులకూ ఆ కంపెనీలో ఆధారాలేవీ దొరక్కపోవడంతో వాటిని ఎక్కడ తయారు చేశారనేది ఆసక్తికరంగా మారింది. వ్యాస్‌ కదలికలపై ఎస్‌వోటీ పోలీసులు నిఘా పెట్టారు. దీంతో అతడు తరచూ చౌటుప్పల్‌ వైపు వెళ్లేవాడని విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్‌ పరిసరాల్లోని ఏదైనా పాత పరిశ్రమలో వ్యాస్‌ మాదకద్రవ్యాల్ని తయారు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఈ డ్రగ్‌ రాకెట్‌లో వ్యాస్‌, అతడి వాహన డ్రైవర్‌ వెంకటేశ్‌తోపాటు ఇండోర్‌కు చెందిన టెంట్‌ సప్లయర్స్‌ దినేశ్‌ అగర్వాల్‌, అతడి తనయుడు అక్షయ్‌, వారి బంధువు చిమన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. దినేశ్ అగర్వాల్‌ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇదే క్రమంలోనే ఖుడేల్‌ ఠాణా పరిధిలోని సానావాడియా గ్రామ శివారులో మాదకద్రవ్యాలు చేతులు మారుతుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.