డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి తన సొంతఊర్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ పెద్ద పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి వెల్లడించారు. రూ. 48,000 కోట్లతో తేజస్ఫైటర్జెట్లు సమకూర్చాలన్న నిర్ణయం గర్వించదగినది ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్ నాధ్ కి సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా సమకూరనున్న 83 తేజస్ ఫైటర్ జెట్లతో భారత వైమానిక దళం మరింత బలపడుతుందన్నారు. రక్షణ రంగం స్వయం సమృద్ధికి ఈ నిర్ణయం కీలకం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో భారత వైమానిక దళంలో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుందన్న ఆయన, దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ ఫైటర్ జెట్లో సరికొత్త సాంకేతికతను జోడిస్తామని వెల్లడించారు.