
DMHO on coronavirus tests in Hyderabad: కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో కరోనా పరీక్షలు విస్తృతం చేశామని, కరోనా లక్షణాలు కనిపిస్తే ఎవరైనా యాంటిజన్ పరీక్షలు చేయించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. కరోనా కట్టడికోసం నగరంలో చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటిజన్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 65 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ ఐసోలేషన్లో ఉండాలనుకుంటే నేచుర్క్యూర్, ఆయుర్వేద ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హోం ఐసోలేషన్ లేనివారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సెల్ఫ్ డిక్లరేషన్ మీదనే హోం ఐసోలేషన్కు పంపిస్తామన్నారు. నగరంలో ఇప్పటి వరకు 11,705 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉండే వారికి ఔషధాలతో కూడిన కిట్ ఇస్తున్నామని స్పష్టంచేశారు.