అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను రుతుపవనాలు ముందుకు కదలకుండా అడ్డుకుంటోంది. సోమవారం కేరళలో ఉన్న రుతుపవనాలు మంగళవారమూ అక్కడి నుంచి ముందుకు కదలలేదు. ఇప్పటివరకూ కేరళ ఉత్తరభాగానికి కూడా విస్తరించలేదు. వాయు తుపాను తీవ్రగాలులు రుతుపవనాల్లోని తేమను లాగేస్తున్నాయి. దీనివల్ల రుతుపవనాల ముందుకు విస్తరించి వర్షాలు పడటం తాత్కాలికంగా ఆగిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈనెల 15 కల్లా తెలంగాణకు రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. సాధారణ పరిస్థితులుంటే జూన్ 15 నాటికి ఇవి తెలంగాణ, మహారాష్ట్రలను దాటి గుజరాత్ వరకూ విస్తరించాలి. ఈసారి ఆ పరిస్థితులు లేవు. తెలంగాణలో బుధ, గురువారాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తాయనిఅధికారులు తెలిపారు. అధిక ఎండలున్న ప్రాంతంలో ప్రజలు బయట తిరగరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. సోమవారం రాత్రి హైదరాబాద్లో 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి సాధారణంకన్నా 5 డిగ్రీలు అధికం. గాలిలో తేమ కూడా సాధారణంకన్నా 11 శాతం తగ్గి 60కి చేరడంతో ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..