AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళవాసులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త.. ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. ప్రకటించిన సీఎం విజయన్

కేరళ రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు.

కేరళవాసులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త.. ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. ప్రకటించిన సీఎం విజయన్
Balaraju Goud
|

Updated on: Dec 13, 2020 | 5:59 AM

Share

కేరళ రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీపై ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఈ వ్యాక్సిన్‌ కోసం ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ప్రకటించిన రాష్ట్రాల్లో కేరళ మూడోది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.

మరోవైపు, కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 59,690 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,949 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక, 24 గంటల వ్యవధిలో 5,268 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కేరళలో మొత్తంగా 6.64లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 6.01లక్షల మందికి పైగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, ఇవాళ కరోనా మహమ్మారి బారినపడి మరో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,594కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 60,029 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలకు హాజరు కాకపోవడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా సీఎం విజయన్‌ స్పందించారు. ‘ప్రచారం అంటే ప్రజలను సమీకరించడం. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇది వాంఛనీయం కాదు. నేను సమావేశాలకు హాజరైతే పెద్ద ఎత్తున జనం గుమిగూడుతారు. నా ఎన్నికల ప్రచారం ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. నేనూ ప్రజలకు దూరం కాలేదు.. వారూ నన్ను దూరం చేసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.