దేశంలో కరోనా ప్రభావితం చేయని రంగమంటూ లేని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ బారి నుంచి అసలు బయటపడతామా లేదా అన్న సందేహాలు చాలా మంది మదిని తొలుస్తున్నాయి, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. జన సంచారంపై ఎన్ని ఆంక్షలు పెడుతున్నా బేఖాతరు చేస్తున్న అనాగరిక మనుషులు అసలు కరోనా వైరస్ నియంత్రణకు సహకరిస్తారా? లేకపోతే మానవాళి మొత్తం అంతరించిపోతుందా? ఈ సందేహాలు అందరి మెదళ్ళను మధనపెడుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు మేము సైతం అంటూ ముందుకొచ్చారు.
ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా అని ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కొంత కోత పెట్టి మరీ కరోనా కట్టిడికి అవసరమైన నిధులను కేటాయిస్తున్నాయి ప్రభుత్వాలు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకుంటూనే కునారిల్లిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలా అని మధన పడుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. చివరికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి వేతనాల్లో కోత విధించారు.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు స్వయంగా ముందుకొచ్చారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్ర స్వచ్ఛందంగా తమ వేతానాల్లో 30 శాతం కోత విధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈరకంగానైనా ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలకు ఎంతో కొంత నిధులు అందుబాటులో వుంచేలా చేద్దామన్న ఉద్దేశంతో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఈ మేరకు అకౌంట్స్ విభాగాన్ని కోరాు. కరోనా బారి నుంచి దేశం బయట పడి తీరుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.