సామాన్యులపై ధరలు పంజా విసురుతున్నాయి. వినియోగదారుడు ఏ వస్తువు కొందామన్నా కన్నీళ్లే వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఈ జాబితాలో మొన్నటి వరకు ఉల్లిపాయ, పెట్రోల్ అండగా.. వాటి తోడుగా ఇప్పుడు వంట నూనె వచ్చి చేరింది. మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సామాన్యుడిని వంటనూనె ధరల పెరుగుదల మరింత ఇబ్బందుల్లోకి నెట్టనుంది. గడిచిన మూడు నెలల్లో వంటనూనె ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. వచ్చే రెండు నెలల్లో మరో 10 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు.
వంటనూనెల ధరలు పెరుగడానికి సరఫరా వ్యవస్థ ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ కారణంగా మలేషియా, ఇండోనేషియా దేశాల్లో కార్మికుల కొరత కారణంగా పామాయిల్ దిగుమతి తగ్గిపోయిందని అంటున్నారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ధరలు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. కాగా, 2019, 2020 ఆర్థిక సంవత్సరాల్లో వంట నూనె ధర రూ.85, రూ.77 ఉండగా.. ప్రస్తుతం వంట నూనె లీటరు ధర రూ.110కి చేరింది. ఈ ధర మరింత పెరిగి రూ.150 వరకు చేరుకునే అవకావం ఉందని విశ్లేషకులు అంటున్నారు.