కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. 14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త భవన నిర్మాణం కొనసాగనుంది. భవన నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పనులను ప్రారంభించనుంది.
ప్రస్తుత పార్లమెంట్కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్పథ్ రోడ్ను మెరుగుపరుస్తారు.
★ 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లెమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది.
★ పార్లమెంట్ భవన నిర్మాణానికి దాదాపు రూ. 971 కోట్ల వ్యయంతో కొత్త భవనం రూపుదాల్చనుంది.
★ భూకంపాలకు చెక్కుచెదరకుండా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
★నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్, మొదటి, రెండు అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది.
★ ఈ భవన నిర్మాణ బాధ్యతలను దిగ్గజ సంస్థ ‘టాటా’ చేపట్టింది. గుజరాత్కు చెందిన హెచ్సీపీ సంస్థ పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేసింది.
★ నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగాను, 9 వేల మంది పరోక్షంగాను పాలుపంచుకుంటారు. 200 మందికిపైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు ఇందులో పాల్గొంటారు.
★ 2022 ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
★ 2022 ఆగస్టు 15న దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఈ అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా పార్లమెంట్ కొత్త భవనాన్ని తీర్చిదిద్దాలని, ఆ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని సంకల్పించారు.
★ ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవన నిర్మాణం.
★ లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మాణం.
★ భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం.
★ సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు వంటివి ఏర్పాటు చేస్తారు.
★ పార్లమెంటుకు కాస్త దూరంలో ఇప్పుడున్న శ్రమశక్తిభవన్ స్థానంలో ఎంపీల కోసం 2024 నాటికల్లా 40 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ప్రత్యేక కార్యాలయాలు నిర్మాణం.
★ పార్లమెంటు, ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భమార్గం ఏర్పాటు చేస్తారు.
★ విశాలమైన ఈ భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరిగితే.. లోక్సభలో ఒకేసారి 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
★ ఎంపీలందరికీ ఈ భవనంలోనే ప్రత్యేక కార్యాలయాలను నిర్మిస్తున్నారు. 2024 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
★ ఆధునిక ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణిస్తున్న ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని చేపట్టారు.
★ పార్లమెంట్ భవన నిర్మాణంలో రెండు వేల మంది ప్రత్యక్షంగా, తొమ్మిది వేల మంది పరోక్షంగా పాల్గొంటున్నారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనానికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. అప్పట్లో రూ.83 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. 1927 జనవరి 17న నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త భవన నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించింది. వందేళ్లవుతున్నా పార్లమెంట్ భవనం చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.