
ఏపీ ప్రభుత్వం అక్రమ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టదిట్టం చేసింది. ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తూ దొరికినా కూడా కఠినమైన కేసులు పెడుతున్నారు. అయితే తాజాగా కృష్టా జిల్లాలో ఓ ఖాకీ ట్రాక్ తప్పాడు. అక్రమ మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని భీమవరం టోల్గేట్ వద్ద జరిగింది. ముందస్తు సమాచారంతో వత్సవాయి ఎస్ఐ సోమేశ్వర రావు సిబ్బందితో కలిసి భీమవరం టోల్గేట్ వద్ద సోదాలు జరిపారు. ఈ సమయంలో చిల్లకల్లు పోలీస్ స్టేషన్కు చెందిన మద్దిరాల పెద్దశీను కానిస్టేబుల్ ఇండికా కారులో అటువైపు వచ్చారు. అతని కారులో సోదాలు జరపగా, 264 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వాటిని కోదాడలో కొనుగోలు చేసి నందిగామకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
Also Read :
వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం