
ఇంటర్ ఫలితాల్లో తప్పులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యంపై అధికారులను ప్రశ్నించారు సీఎం కేసీఆర్. నిర్లక్ష్యం ఎవరిదైనా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీవేరిఫై, రీకౌంటింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే.. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవేరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే తగిన ఫీజులు చెల్లించాలని.. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరాదని హితవు పలికారు. అటు.. సీబీఎస్ఈ స్థాయిలో 10+2 విధానం అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే.. రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు.